ఇంకా చట్టం కాకుండానే ‘దిశ’ పోలీసు స్టేషన్లు ఎలా పెడతారు?: ఎమ్మెల్యే అదిరెడ్డి భవాని

  • ఫిర్యాదును ‘దిశ’ చట్టం కింద నమోదుకు నిరాకరణపై ఆగ్రహం
  • వైసీపీ ప్రభుత్వం మహిళలను మభ్య పెడుతోంది
  • అసభ్యకర పోస్టులపై స్పీకర్ కూడా చర్యలు తీసుకోలేదు
సోషల్ మీడియాలో తనపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిని వెంటనే గుర్తించి శిక్షించాలని టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని డిమాండ్ చేశారు. ఈ పోస్టులపై తాను దిశ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తే.. కేంద్రం ఇంకా చట్టాన్ని ఆమోదించనందున ఇప్పుడు ‘దిశ’ కేసు నమోదు చేయలేమని పోలీసులు చెప్పడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. చట్టాలు పూర్తికాకుండానే ‘దిశ’ పేర ప్రత్యేక పోలీసు స్టేషన్లు ఏర్పాటుచేసి మహిళలను మభ్య పెట్టేలా వైసీపీ సర్కారు వ్యవహరిస్తోందని మండి పడ్డారు. మరోవైపు ఫిర్యాదు చేసిన ఇతర మహిళలు కూడా ఇదే రీతిలో విమర్శిస్తున్నారు. ‘దిశ’ పోలీసు స్టేషన్లలో సామాన్యులకు న్యాయం జరుగుతుందా? అని వారు ప్రశ్నిస్తున్నారు.


శాసనసభలో తాను మధ్యంపై మాట్లాడిన తర్వాత సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారని ఎమ్మెల్యే చెప్పారు. దీనిపై స్పీకర్ కు కూడా ఫిర్యాదు చేశానని భవాని చెబుతూ.. ఇప్పటికే రెండు నెలలు గడిచిపోయాయని, అయినా చర్యలు తీసుకోలేదన్నారు.  ఈ నేపథ్యంలోనే తాను ‘దిశ’ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు.

MLA Adireddy Bhavani
Telugudesam
Disha
Complaint
Andhra Pradesh

More Telugu News